మెట్రోపై రగడ.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలకు సాంకేతిక ఇబ్బందులున్నాయి: కిషన్‌ రెడ్డి

  • తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్‌రెడ్డి
  • మెట్రో విస్తరణకు సహకరిస్తున్నామని వ్యాఖ్య
  • అభివృద్ధిపై తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి 
  • తాను చెబితే ప్రాజెక్టులు ఆగవన్న కిషన్‌రెడ్డి
  • దిగజారుడు రాజకీయాలు చేయొద్దంటూ విమర్శలు
హైదరాబాద్‌ మెట్రో విస్తరణను కేంద్రం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఖండించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో రేవంత్‌ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 అమలుకు కేంద్రం రూ.1,200 కోట్లు అందించిందని వెల్లడించారు. మెట్రో విస్తరణ కోసం మరింత చురుగ్గా పనిచేయాలని తానే రేవంత్‌రెడ్డికి లేఖ రాశానన్నారు. ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రుణం పొందేందుకు కూడా కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. ఐఆర్‌ఎఫ్‌సీ రూ.13 వేల కోట్ల రుణ ప్రతిపాదన విషయంలో కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని తెలిపారు. వాటిని కేంద్రంతో చర్చించి పరిష్కరించుకోవాల్సింది పోయి రాజకీయ విమర్శలకు దిగడం సరికాదన్నారు. ఆ సమస్యను తనపై నెట్టేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు.

తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు, ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్రాజెక్టు, ధాన్యం కొనుగోలు వంటి అంశాల్లో కేంద్రం సహకరిస్తోందన్నారు. మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి అవసరమైన రుణాల మంజూరుకు కూడా కేంద్రం ఎన్‌ఓసీ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రం ఎలాంటి వివక్ష చూపదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.

దిగజారుడు రాజకీయాలకు పాల్పడకుండా అభివృద్ధి అంశాలపై కేంద్రంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. కిషన్‌రెడ్డి చెప్పినంత మాత్రాన ప్రాజెక్టులు ఆగిపోవని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.

G Kishan Reddy
Revanth Reddy
Hyderabad Metro Expansion
Telangana Politics
Central Government Funds
Metro Rail Project

More Telugu News